Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

పెన్షన్ చరిత్ర

 PENSIONER'S DAY (17 DEC 2022) సందర్భంగా దాని పుట్టు పూర్వోత్తరాలు గురించి తెలుసుకుందాము 

1983 నుండి ఏటా డిసెంబరు 17న 'పెన్షనర్స్ డే 'గా జరుపుకొంటున్నాం. పెన్షన్ కు భారతదేశంలో దగ్గర దగ్గరగా 160 ఏళ్ళ చరిత్ర వుంది.

► నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరు సకాలంలో పెన్షన్ పొందుతూ ప్రశాంత జీవనం గడపడం వెనుక ధరమ్ స్వరూప్ నకారా (డి.యస్. నకారా)  చేసిన కృషి, సాగించిన పోరాటం చిరస్మరణీయం. మన దేశంలో పెన్షన్ పొందుతున్న పెన్షనర్స్ కు ఆయన చిరస్మరణీయుడు. ఆయన పోరాట ఫలితంగా సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు ఉండబట్టే పెన్షన్ నుండి ప్రభుత్వాలు తప్పించుకుందాం అనుకున్నప్పటికి వీలు కాకుంది.

► 1889 లో ప్రపంచంలో మొదటి సారిగా ప్రభుత్వ పింఛన్ విధానాన్ని అప్పటి జర్మనీ ఛాన్సలర్ ఒట్టోవాస్ బిస్మార్క్ ప్రవేశపెట్టారు.

► రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు పింఛన్ విధానాన్ని అమలు చేశాయి. 

► రిటైర్మెంట్ అనంతర జీవనం కోసం తమ రిటైర్డ్ ఉద్యోగులకు కొంత సొమ్ము అందజేయాలని ఆనాటి వలసప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా భారత పెన్షన్ చట్టం, 1871 ద్వారా ఈ వ్యవస్థ రూపుదిద్దుకొంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తటస్థీకరించేందుకు పెన్షన్ ను అప్పుడప్పుడు పెంచుతూ బ్రిటీష్ ప్రభుత్వం పరిహారం కల్పించేది.

► 1920లో అప్పటి బ్రిటీషు ప్రభుత్వంలో ఉద్యోగులకు ఉన్న కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కు బదులు ప్రత్యామ్నాయంగా DEFINED BENEFIT PENSION దేశంలో అమలులోకి వచ్చింది.

► 1957లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఈ DEFINED BENEFIT PENSION తప్పనిసరి చేసినారు. తరువాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ DEFINED BENIFIT PENSION విధానాన్ని పాటించాయి.

► 1980 లో దశాబ్దాల పోరాటాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో AP REVISED PENSION RULES-1980 ను GO.NO:88, DT:26-03-1980 ద్వారా వర్తింప చేశారు.

► 1981 లో కుటుంబ పెన్షస్ హక్కు సాధించబడింది.

• రిటైర్ మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం అందజేస్తున్నప్పటికీ 1922, జనవరి 1 నుండి అమలులోకి వచ్చిన ఫండమెంటల్ రూల్స్లో వాటిని పొందుపర్చలేదు. రక్షణ మంత్రిత్వశాఖలో ఆర్థిక సలహాదారుగా వున్న డి ఎస్ నకారా ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆడిట్ అండ్ అక్కౌంట్స్ ఒక ఆఫీసర్గా 1972 లో రిటైరయ్యారు. మిగతా పెన్షనర్లలాగే ఆయనకూడా పెన్షన్ పొందటంలో అనేక ఇబ్బందుల నెదుర్కొన్నాడు. అందువల్ల ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు చంద్రచూడ్ ఫిర్యాదుదారు, ప్రభుత్వ వాదనలను విన్నారు. "పెన్షస్" అన్నది బహుమతిగా లేదా పారితోషికంగా లేదా దయతో ఇచ్చే అదనపు ఫలితంకాదని, అది సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించి రిటైరైన ప్రభుత్వోద్యోగి హక్కు అని తమ తీర్పులో తేల్చి చెప్పారు. తన ఉద్యోగులు రిటైరైన తరువాత ఒక శాంతియుత, గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక తీర్పు 1982 డిసెంబరు 17న వెలువడింది. ఆ కారణం గానే డిసెంబరు 17న నేడు దేశమంతటా ' పెన్షనర్స్ డే' (పింఛనుదార్ల దినోత్సవం)గా పాటిస్తున్నారు.

• డి.యస్.నకారా పెన్షన్ దారుల కోసం చేసిన న్యాయ పోరాటం ఆయనకు విశేషమైన గుర్తింపు లభించుటకు కారణమైంది. పదవీవిరమణ తరువాత భారత్ సేవా సమాజం న్యూఢిల్లీ పెన్షనర్స్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెన్షన్ చెల్లింపులలో ప్రభుత్వాల వివక్షతను గమనించారు. 1977 సంవత్సరానికి ముందు పదవీవిరమణ చేసినవారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లలో వివిధ కారణాల పేరుతో కోతలు విధించేవారు. ఆనాడు అత్యధికంగా రూ675/లు మాత్రమే పెన్షస్ వుండేది. ఆ కొద్ది పాటి పెన్షస్ తో కుటుంబ జీవనం గడపడం కష్టతరంగా వుండేది. కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం ద్వారా లభించు ఆర్థిక, ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో వున్న వారికే వర్తించునని,అంతకు పూర్వం పదవీవిరమణ చేసినవారికి వర్తించవని 1979 మే 25 నాడు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా, ఈ ఉత్తర్వులు పెన్షన్ దారులను కుంగదీసాయి.అరకొర పెన్షన్లతో జీవించడం కన్నా మరణమే మేలని మానసిక భావనకు పెన్షన్ దారులు గురయ్యారు.    

• స్వయంగా పెన్షన్ బాధితుడైన డి.యస్. నకారా మరికొంతమంది పెన్షస్ బాధితులతో కలసి దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు లో రాజ్యాంగం లోని ఆర్టికల్ 32 క్రింద కేసు నెం. 5939-41/1980 రిట్ పిటిషన్ దాఖలు చేసారు.

• ఆనాడు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ వై.వి. చంద్రచూఢ మరియు ఓ.చిన్నపురెడ్డి, హరూల్ ఇస్లాం,వి.డి. తుల్జాపూర్కర్, డిఏ దేశాయి ఈ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సంక్షేమ రాజ్యం యొక్క బాధ్యత లు, గతంలో యిచ్చిన తీర్పులు, భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14, వాటి పూర్వాపరాలను పరిశీలించి 1982 డిశంబర్ 17 న చారిత్రాత్మక మైన తీర్పును వెలువరించినది. తీర్పు యొక్క సారాంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులలో ఒకరైన జస్టీస్ దేశాయి ప్రకటించారు.

గౌ!! సుప్రీం కోర్టు తీర్పు లోని ముఖ్యాంశాలు:

► పింఛన్ అనేది యజమాని ఇష్టాయిష్టములతో, దయతో యిచ్చు దానము కాదు. అది పింఛనుదారుని యొక్క స్థిరమైన హక్కు. గతంలో ఉద్యోగిగా అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించేదే పింఛస్.

► ఉద్యోగి పదవీవిరమణ అనంతరం వృద్దాప్య జీవితం సుఖ సంతోషాలతో, గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదిగా పింఛన్ ను పరిగణించాలి.

► పింఛన్ దారుడు స్వశక్తిపై ఆధారపడి జీవించుటకు కల్పించబడిన ఆర్థిక, న్యాయ పరంగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్యగా పింఛన్ ను పేర్కొనటం జరిగింది.

► కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల కు ఒక తేదీని ఎంచుకొని దానికి ముందు గాను, తరువాత రిటైరైన వారిని విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ 14 కి విరుద్ధం. నిర్ణీత తేదీకి ముందు రిటైరైన వారికి కూడా, ఆ తేదీ తర్వాత రిటైరైన వారితో సమానంగా పెన్షన్ సవరణ లాభాలు ఇవ్వాలని ఆదేశించింది.

► పెన్షనర్స్ అందరిని ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపజేయాలి. పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు.

       పైన పేర్కొన్న తీర్పును దృష్టిలో పెట్టుకొని 2014 సం.లో ఏప్రిల్ 30 న సుప్రీం కోర్టు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జిఓ నెం.87 తేది 25-5-1998 ప్రకారం ఈ తేదీకిముందు పదవీ విరమణ చేసిన వారికి ఒక రకంగా తరువాత రిటైరైన వారికి ఒక రకంగా పెన్షన్ వుండరాదని పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు చెప్పింది.

      డి.యస్.నకారా చేసిన కృషి ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్షలాది పెన్షనర్ల జీవితాలకు ముసురుకున్న చీకట్లు తొలగి పోయాయి. కొత్త ఆశలు చిగురించాయి. భవిష్యత్ పై విశ్వాసం ఏర్పడి ,నకారా ఆశాజ్యోతి గా నిలచిపోయారు. 

• భారతదేశంలో ఇటీవల చోటు చేసుకొంటున్న పెన్షన్ సంస్కరణలు, పిఎఫ్ ఆర్ ఎ (పెన్షన్ ఫండ్ క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ) బిల్లు, ప్రపంచబ్యాంకు పెన్షన్ నమూనాకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. 

• పెన్షన్ సంస్కరణలలో ప్రభుత్వానికి బాగా నచ్చినది, ప్రస్తుతమున్న పెన్షన్ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలన్నది. ఈ పెన్షన్ స్కీం అమలు జరుపుతున్న దేశాలలో చిలీ, స్వీడన్, పోలెండ్, మెక్సికో, ఆస్ట్రేలియా, హంగరీ, కజకిస్థాస్ వంటి దేశాలున్నాయి. భారత ప్రభుత్వం ప్రధానంగా చీలీ పెన్షన్ సంస్కరణ పథకం పట్ల మరింతగా ఆకర్షితురాలైంది.

• 2004, జనవరి 1 నుండి కేంద్రప్రభుత్వ సర్వీసులలో చేరే నూతన ఉద్యోగులకు PFRDA బిల్లు ద్వారా నూతన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది అమలులో వున్న కంట్రిబ్యూటరీ యేతర డిఫైన్డ్ బెనిఫిట్ పథకానికి బదులు డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రతిపాదిస్తోంది. దీని క్రమబద్ధీకరణ నిర్వహణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (PFRDA) చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ మూలవేతనం, డిఎపై 10  శాతం చెల్లిస్తే, అంతే మొత్తం ప్రభుత్వం జమచేస్తుంది.

• బ్యాంకులలో 2010 ఏప్రిల్ 1న, ఆ తరువాత చేరిన ఉద్యోగులు, అధికార్లకు ఈ స్కీం వర్తింపజేయ బడుతోంది. కొత్త ఉద్యోగులకు వేరేగా మరిలాంటి ప్రావిడెంట్ ఫండ్ లేదు. ఈ ఉద్యోగ వ్యతిరేక పెన్షన్ ఫండ్ బిల్లు (PFRDA)ను పార్లమెంటులో ఆమోదం పొందడంతో ఈ విశేష హక్కును కేంద్రప్రభుత్వం లాక్కొన్నట్లైంది. ఈ కొత్త పెన్షన్ పథకంలో ఉన్నవారి పెన్షన్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి వుంటుంది. ఆ విధంగా జీవన సంధ్యా సమయంలో వారి ఆదాయం అనిశ్చితిగా మారి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇది ప్రైవేటు మదుపుదార్ల, సెట్టా మార్కెట్ ప్రయోజనాలను కాపాడడానికే తప్ప ఉద్యోగుల భద్రతకు ఏ మాత్రం సరిపడనిది.

• నేటికి 16.40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఏపీ వారు 1.57 లక్షల మంది వున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 264 మందికి పైగా చనిపోయిన వారు వుంటారు. ఈ కుటుంబాలకు మాత్రం పెన్షన్ రావటం లేదు. ప్రతి నెలా వేతనం, కరువు భత్యం నుండి 10 శాతం చొప్పున మదుపు చేసిన పెన్షన్ ఫండ్ నుండి సీపీఎస్ రూల్ ప్రకారం క్లైమ్ చేసుకోవాల్సిన 60 శాతం సొమ్ము కూడా సకాలంలో రాక ఆ కుటుంబాలు అనేక అవస్థల పాలవుతున్నాయి. పాత పెన్షన్ పథకం వారికి గ్రాట్యుటీ సదుపాయం వుండటం వలన చనిపోయిన లేదా రిటైరైన ఉద్యోగి కుటుంబానికి గరిష్టంగా రూ.15 లక్షల వరకు లభించేది. సీపీఎస్ లో గ్రాట్యుటీ అవకాశం లేకపోవటం వలన ఆ కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉంది. పెన్షన్ కాదది వంచనగా రుజువైంది. పాత పెన్షన్ పథకం కంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే లాభదాయకంగా వుంటుందనే పాలకుల మాటలు పచ్చి అబద్ధాలు తేలిపోయింది.

• సీపీఎస్ ప్రమాదం తేటతెల్లమవుతున్న కొద్దీ ఉద్యోగుల్లో అభద్రత, ఆందోళన పెరుగుతోంది. దానితో సీపీఎస్క వ్యతిరేక ఉద్యమాలు ఊపందు కుంటున్నాయి. సీపీఎస్ చందా దారులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రత్యేక సంఘాలుగా సమైక్యమై నిరంతర పోరాటాలు చేస్తున్నారు. సీపీఎస్ అపాయింట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఖ్య పెరగటంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నాయి. NGO సంఘాలు జాతీయ సమాఖ్యలతో కలిసి దేశవ్యాపిత ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేయడం మంచి పరిణామం. అధికారంలోకి వచ్చిన 7రోజులలో మన రాష్ట్రంలో సి పి యస్ రద్దు చేస్తామని చెప్పి అధికాంలోకి వచ్చి దాదాపు 4సంవత్సరాలయినా కమిటీలతో రేపుమాపని కాలయాపన చేయడం తీవ్ర అసంతృప్తి గా ఉంది.

• సీపీఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అనుమతించకుండా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వరకే అంగీకరించటం వలన ఫలితం ఉండదు. తద్వారా ఉద్యోగుల ఉద్యమాలు శాంతిస్తాయని పాలకులు భావిస్తే అది వారి భ్రమ. నాలుగేళ్ళ నుండి సీపీఎస్ పై పోరాటాలు దేశవ్యాపితంగా వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకో జూస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పెన్షన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అనే విషయాన్ని ఏమార్చలేవు. ఉద్యోగుల జీతభత్యాలు, సెలవులు, పెన్షన్ తదితర కొన్ని ముఖ్యమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అనుసరించే ధోరణి గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతోంది. అందువలన సీపీఎస్ విషయంలో కూడా అదే ధోరణి వ్యక్తమవుతోంది. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అనుమతించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల వంటి పరిణామాలు సీపీఎస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయరక్షణలో పడుతున్నట్టు కనిపిస్తోంది. పోరాడి విజయం సాధించాలి. కమిటీలతో రేపుమాపని కాలయాపన చేయడం, కొత్త కొత్త రుట్ మ్యాప్ లను ప్రకటించడం జరిగి నేడు మన రాష్ట్ర ప్రభుత్వం మరో మోసానికి మనల్ని గురిచేసేలా సీపీయస్ కు బదులుగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేపేరు మార్చి ఏమార్పాలను కుంటుంది. ఆదిశగా మంత్రులకమిటినీ వేసి ఉద్యోగ సంఘనాయకులను సమావేశపరచి ఒప్పించాలనుకోవడం ఖచ్చితంగా CPS ఉద్యోగులను మోసం చేయడానికే అని అర్ధం అవుతుంది. 

• సీపీఎస్ నీ రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అనుమతించకుండా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వరకే అంగీకరించటం వలన ఫలితం ఉండదు. తద్వారా ఉద్యోగుల ఉద్యమాలు శాంతిస్తాయని పాలకులు భావిస్తే అది వారి భ్రమ.

• భారతదేశంలో ప్రస్తుతం 60ఏళ్ళ పైబడినవారు శాతానికి మించివున్నారు. అంటే సుమారు 10కోట్లమంది. ఈ సంఖ్య 2050 నాటికి 21 శాతానికి అంటే 33.6 కోట్లకు చేరుకొంటుంది. మనదేశంలోని 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికి వారు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ము కొనేవారు కావచ్చు. లేదా ఇళ్ళల్లో పనిచేసే ఇంటిపని వారలు కావచ్చు ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత, జీవిత సంధ్యా సమయంలో వారందరికీ ఒక భరోసాగా పెన్షన్ సాధిం చాల్సి వుంటుంది. వారంతా వయసులో వున్నంతకాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడిన వారే." అంటే *ఇప్పుడు పెన్షనర్ల పెన్షన్ ను పరిరక్షించడం, పెన్షన్ లేనివారికి పెన్షన్ కల్పించడమే మనముందున్న బృహత్తర కర్తవ్యం. ఆ కర్తవ్యానికి పునరంకితులు కావాలి.

గమనిక :దయచేసి మీకు తెలిసినవారికి దగ్గిరబంధువులకు షేర్ చెయ్యండి 





Post a Comment

0 Comments