శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో వేదాంతశర్మ పీఠికా పురములో బ్రాహ్మణ్యం జరుపు గోష్టి కోసం ఏర్పాటు చేస్తూ, ఎవరిని పిలవాలని నిర్ణయించే అధికారం వేదాంతశర్మకే యీయబడినది. ఆ పండితగోష్టి యొక్క ఉద్దేశ్యం వేరుగా ఉండెను.
వేదాంతశర్మ: గోష్టి తరపున విస్తృతమైన ఏర్పాట్లు చేయబడుచున్నవి.శ్రీపాదుల వారు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి, దానిని సాకుగా తీసుకొని, ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి, వారి అనుమతిని పొంది, ఆ రెండు కుటుంబములను పీఠికాపురము నుండి తరిమివేయుట వారి ఆంతర్యము.బ్రాహ్మణ్యం వారు నాకు తమ ఆంతర్యమును తెలియజేసినప్పుడు నేను కూడా వారితో కలిసితిని. బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడను కావలెనని విచిత్రమైన, బలీయమైన కోరిక నాలో ఉద్భవించినది.
శ్రీపాదుల వారు యదేచ్చగా ఏ కులము వారి ఇంటికి అయిననూ వెళ్లేడివారు. వారు చాలా స్వతంత్రముగా వ్యవహరించేవారు.అదే పీఠికాపురంలో బంగారయ్య, బంగారమ్మ అను దంపతులు ఉండేవారు. వారికి శ్రీపాదుల వారిని చూడవలెనని, వారితో సంభాషించవలెననియు కోరిక మిక్కుటంగా ఉండెడిది. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకు చర్మపాదుకలు కావలెనని కోరిరి. అప్పటికి వారి వయస్సు పదునాలుగెండ్లు. బ్రాహ్మణులు చెక్కపాదుకలను ధరించవలెనే గాని, చర్మపాదుకలు ధరింపకూడదని ఇంటిలోని వారు నిరాకరించిరి.
ఈ విషయము కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది. వారు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను సమర్పించి ధన్యత నొందవలెనని తలంచిరి. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు, వారి ఇంట ప్రత్యక్షమైరి. వారి దివ్య శ్రీచరణముల కొలతలు తీసుకోనబడినవి.బంగారమ్మ, మహాప్రభూ! నా చర్మము ఒలిచి చెప్పులుగా కుట్టి ఈయవలెనని ఉన్నది. అని శ్రీపాదుల వారితో అన్నది. శ్రీపాదుల వారు మందహాసం చేసి అంతర్ధానమయిరి.మా ఇంట ఒక మంచి ఆవు ఉండెడిది. అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయినది. చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి, బంగారయ్య, బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మపాదుకలు తయారుచేసిరి.
ఇంతట్లోనే వేదపండిత గోష్టి ప్రారంభమయ్యెను. ఆది శంకరుల గురించి చర్చ ప్రారంభమయ్యెను.చర్చ గురించి, రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments