దేవాలయాల్లో దానం చేయాల్సినవి
ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే... ఆ ఆలయానికి ఏమి అందిస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది #విష్ణుధర్మోత్తర పురాణం తృతీయఖండం మూడువందల నలభైఒకటో అధ్యాయం.
దేవాలయం అనేది ఒక పుణ్యవ్యవస్థ. దాని నిర్మాణ, నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ, సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.
★ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటం, లాంటి శ్రమదానాలకు "శ్రీమహావిష్ణులోక ప్రాప్తి” లాంటి పుణ్యఫలాలు కలుగుతాయి.
★ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు.
★గంటను దానం చేస్తే మహాగొప్ప కీర్తిని పొందుతాడు.
★గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.
★చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది.
★పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు.
★చాందినీలు ఏర్పాటు చేసినవాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు.
★ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు.
★మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని,
★నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు.
★కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది.
★వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి.
★ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం.
★చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.
★దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమస్థానం లభిస్తుంది.
★పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం.
★ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది.
★దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు.
★దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది.
★దేవుడి పరిచర్యల కోసం చిన్నచిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది.
★ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్యఫలితాన్ని పొందుతాడు.
★వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు.
★పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి,
★పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి.
★నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి.
★ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి.
★శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం,
★ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి,
★దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను, వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.
★దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది. ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది.
★వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే.
★పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి,
★జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.
దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే... ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.
0 Comments