శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదుల వారు బ్రాహ్మణ పరిషత్తును, ఆత్మ ఒకే సమయమున మూడు నాలుగు శరీరములలో ఉండి, మూడు నాలుగు జన్మముల కర్మ ఫలితములను రహితము చేసుకొనగలదా? అని ప్రశ్నించారు. గతములో జరిగిన దాఖలాలు లేవు అని, జటిలమైన ప్రశ్న అని బ్రాహ్మణ పరిషత్తు వారు చెప్పిరి.
శ్రీపాదుల వారు: గతములో లేకేమి! ఉన్నవను విషయము మీకు తెలియదు. దేవేంద్రుడు శాపవశమున పంచ పాండవులుగా జన్మించెను, శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యేనని ఉన్నది. శచీపురందరులు భూమి మీద జన్మించిననూ కూడా, స్వర్గము నందు మూలతత్వము ఉండకపోదు.
శయ్యా సుఖమును మాత్రము అర్జునుడు పొందెను. ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించేది. భీమునకు తల్లి వలె రుచికరమైన భక్ష్యభోజ్యములు తయారు చేసిపెట్టేది. అర్జనునకు శయ్యా సుఖమును ఇచ్చినది.నకులునకు లక్ష్మీస్వరూపిణిగా కనిపించేది.సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగినవాడైన కారణమున జరుగవలసిన సంఘటనలు తొందర తొందరగా జరిగి క్షేత్రసంగ్రామము త్వరగా ముగియవలెనని కోరుకొనువాడు. అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనముతో వానితో మెలిగేది.
దేవతా ధర్మములు వేరుగా ఉండును. మనుష్య ధర్మములు వేరుగా ఉండును. జంతు ధర్మములు వేరుగా ఉండును. అన్నిటినీ కలగాపులగము చేయరాదు. వేదాంతశర్మ: పురాణకాలములలో అనేక వింత విషయములు జరిగి ఉండవచ్చును. ప్రస్తుతకాలమున అటువంటివి ఎమియూ జరుగుట లేదు కదా!
శ్రీపాదుల వారు: తీక్షణ దృష్టితో వేదాంతశర్మను చూసి, సంబోధించుచూ, నీవు ముగ్గురు స్త్రీలను వివాహమాడితివి. ముగ్గురునూ మరణించిరి. ముగ్గురకూ మూడు ఆత్మలు కలవా? లేదా ఒకే ఆత్మ కలదా? మగవాడు ముగ్గురు స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతము అయినప్పుడు, ఒక స్త్రీ ముగ్గురు పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా?
అసలు ఆత్మ అంటే ఏమిటి? దాంపత్య ధర్మము అనగానేమి? వేదాంతశర్మ: మగవాడు ఎందరి స్త్రీలనైనా వివాహ మాడవచ్చును గాని, స్త్రీకి మాత్రము అటువంటి హక్కులేదు అని వక్కాణించెను.
శ్రీపాదుల వారు: ఓహో! నీవు జగన్నియంత కంటే గొప్పవాడివా?మండోదరి మహాపతివ్రత. ఆమె వాలికి భార్యగా ఉండునప్పుడు ఆమె శరీరాణువులు వేరు. రావణాసురుని భార్యగా ఉండునప్పుడు శరీరాణువులు వేరు. విభీషణునికి భార్యగా ఉండునప్పటి శరీరాణువులు వేరు. ఆత్మ నిర్వికారమైనది కనుక, దేనితోనూ సంగమము కలిగినది కాదు కనుక, అది నిత్యయుక్తమైనది. శుద్ధమైనది. అత్యంత పవిత్రము. తమో గుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణంగా నిర్వర్తించినది.రజో గుణ ప్రధానమైన రావణుని భార్యగా ఉండునప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది.
విభీషణునికి భార్యగా ఉండునప్పుడు సత్వ గుణ ప్రధానముగా తన బాధ్యతలను నిర్వర్తించినది కదా,! వేదాంతశర్మ: జవాబు చెప్పలేక పోయితిని. తదుపరి ఆలోచించి, శ్రీపాదా! నీవు చెప్పునది అంగీకరించిన యెడల బహుభతృత్వము కూడా అంగీకరించవలెను. శ్రీపాదుల వారు మరిన్ని విషయాలు చెప్పిరి. అవి రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments