శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో పీఠికాపురము లో బైరాగి తన యొక్క అనుభవాలు గురించి తెలియ జేస్తూఉన్నారు.
బైరాగి: పురాణప్రవచనం అను నాటకము ముగిసింది. శూద్రుల నుండి సంభావనలు స్వీకరించెను. లక్ష్మి శూద్ర కులమున జన్మించినది. శూద్ర సంబంధమును స్వీకరించుటతో శూద్రులతో తనకు కర్మబంధము తీరినది అని పండితుడు భావించెను. ఇంకనూ ఏమయినా కర్మబంధములు మిగిలి ఉన్న, వాటిని యోగాగ్నిలో దగ్ధము చేయదలంచెను. బాపనార్యుల ఇంట భోజనము చేయుట వలన తన బ్రాహ్మణజన్మమునకు సంభందించిన ఋణానుబంధము తీరిపోవునని భావించెను.
ఆ మహాయోగికి సంభావనను ఇచ్చు నిమిత్తము బాపనార్యులు లోనికేగిరి. ఇంతలో లక్ష్మి బాపనార్యుల ఇంటికి వచ్చినది. లక్ష్మి ఇంట ఆవు ఒకటి ఈనుటచేత జున్నుపాలను తెచ్చినది. లక్ష్మికి శ్రీపాదుల వారనిన చాలా భక్తిశ్రర్థలు. బాపనార్యులు సంభావన ఇచ్చిరి. పండితుడు తాను వెళ్లేదనని, సెలవు ఇప్పించవలసినది అని కోరెను.
శ్రీపాదుల వారు: అందరునూ నీకు సెలవు ఇచ్చి ఉండిరి. కేవలము ఇద్దరు మాత్రము సెలవు ఇచ్చుటకు నిరాకరించుచుండిరి. నాకు కోమటి లెక్కలు బాగుగా తెలియును. బాకీ ఎంత ఉన్నది? ఎంత తీర్చబడినది? మొదలైన విషయములు ఒకసారి రాం రాం అనుకొననిదే ఈ పీఠికాపురము నుండి నీవు కదులుటకు వీలు లేదు.
బ్రాహ్మణుడు కొంచెం కలవర పడినాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తావతారులు అని ఇదివరకు వినిఉన్నాడు.శ్రీపాదుల వారు: నాయనా! ఈ లక్ష్మి అమాయకురాలు. ఈమె కేవలము కొద్ది సంవత్సరములు మాత్రమే జీవించునది. ఈమె చనిపోయిన తరువాత ఈమె గతి ఏమి కావలెను? నీవు జ్ఞాన రూపమున బ్రాహ్మణుని గానూ, అజ్ఞాన రూపమున లక్ష్మి భర్త అయిన గొల్లవానిగా జన్మించితివి. లక్ష్మి గొల్లవాని రూపములో ఉన్న నీతో కష్టసుఖాలు పంచుకొనినది.
నీ యొక్క గొల్లవాని రూపమున ఉన్న చైతన్యమును విరజానది దాటించి వచ్చిన గోమాత తిరిగి భూలోకమునకు స్వేచ్ఛగా తిరిగివచ్చినది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యమును తన వద్దనే నిలుపుకొనినది. గొల్లవనిత రూపమున ఉన్న ఈ చైతన్యము కొద్ది సంవత్సరముల తరువాత శరీరము పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యము లోనికి మారగలదు. అనగా ఈమె గొల్ల వనిత రూపమున ఉన్న బ్రాహ్మణి. నీవు బ్రాహ్మణ రూపమున ఉన్న గొల్లవానివి.
మీ కర్మ సంబంధములు నాకు బాగుగా తెలియును. పద్మావతీ స్వరూపుడైన నేను, భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబోవు ఈమెను బంగారు బొట్టు పెట్టీ ఆశీర్వదించితిని. ఈమెకు మాంగల్యమును కూడా సృష్టించి హిరణ్యలోకమున దాచి ఉంచితిని. బంగారముతో సంబంధము తెగిపోయిన యెడల భార్యకు భర్తతో సంబంధము తెగిపోవును. అందువలన, హిరణ్య లోకమున ఈమెకు సంబంధించిన మాంగళ్య ఆభరణములు దాచి ఉంచితిమి.
నెలల బాలుడుగా ఉన్న నీ చైతన్యము ఉపసంహరింపబడినచో ఏ అసురుడు అయినా ఆ శరీరమును స్వాధీనము చేసుకొని అకృత్యములు చేయవచ్చును. అందువలన, ఈమె నుండి సువర్ణదానము స్వీకరించి, ఋణానుబంధమును, కర్మ బంధమును ఉపసంహరింపక, ఇంకనూ నిలుపుకొని, మరుజన్మమున ఆదర్శదంపతులై నా భక్తులుగా తరించెదరు. అని చెప్పి దీవించిరి.
నాయనలారా! ఆ విధముగా ఆ నెలల బాలుడు పెరిగి పెద్దవాడగును. లక్ష్మి బ్రాహ్మణిగా జన్మించి అతని భార్య అగును.
శ్రీపాదుల వారి లీలలు అద్భుతము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments