శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో, శ్రీపాదుల వారు పీఠికాపురమును వీడుటకు ఏర్పడిన పరిస్థితులను భాస్కర శాస్త్రి వివరించు సందర్భములో,
పరమహంస పరివ్రాజకులు దత్త దీక్షలు ఇచ్చుట గూర్చి పరిషత్తులు సమావేశమైనప్పుడు బాపనార్యుల వారు, వారి అభిప్రాయం వెలిబుచ్చగా, అంతట ఆ బ్రాహ్మణులు, మనము బ్రాహ్మణులమై ఉండియు పరమహంస పరివ్రాజక మహాశయులు మన గ్రామమునకు వచ్చినప్పుడు పూర్ణకుంభముతో ఎదురేగి, వేద మంత్రములతో స్వాగతము నీయలేదు సరికదా! వారు తమంతట తాము సర్వజనహితము కోరి దత్త మండలదీక్షను ఇచ్చుచుండగా బ్రాహ్మణ పరిషత్తు తమకు ఏమీ పట్టనట్లు ఊరకుండుట నిజముగా సిగ్గుచేటు అయిన విషయము. అని ఆక్షేపణ లేవనెత్తిరి.
బాపనార్యులు: నిజముగా వచ్చినది పరమహంస పరివ్రాజకులే అయిన యెడల వారిని స్వాగ తించుటకు కొన్ని పద్దతులు ఉన్నవి. వారు కొద్దిరోజుల ముందుగానే వారి ప్రధాన శిష్యుల చేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారమును అందించవలెను. పరిషత్తు వారి వివరములను సంపూర్తిగా ఆలకించి, ప్రధాన శిష్యులతో శాస్త్రార్థము చేయుదురు.ఆ శాస్త్రార్థము నందు ప్రధాన శిష్యుల ప్రావీణ్యత తెలియును.
అంతట, పరిషత్తు ఒక నిర్ణయమునకు వచ్చి, వానిని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యుడని నిర్ణయించెదరు. ఆ తరువాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయునప్పుడు, వారికి వేదమంత్రములతో, పూర్ణకుంభముతో స్వాగతమీయబడును.
ఆ తదుపరి వారితో శాస్త్రార్థము జరుగును. అంతట, పరివ్రాజక మహాశయుల సూచన మేరకు యజ్ఞమో, యాగమో, దీక్షయో లేక ప్రవచనమో జరుపవచ్చును. ఇవి ఏమీ లేకుండగా, పరి వ్రాజకులు కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చిరి. వచ్చిన వెంటనే మీతో దత్త మండలదీక్ష గురించి ప్రస్తావించిరి. అంతేకాకుండా భూరిదక్షిణలు ఈయవలసినది అని కోరిరి.
ఇవి మన నియమావళికి విరుద్ధముగా జరిగిన విషయములు కాదా! అంతట బ్రాహ్మణులు, నియమములు ఉల్లంఘించబడినవా లేదా అని చర్చించుటకు ఇది సమయము కాదు. కావున మీరునూ, మీ అల్లుడుగారైన అప్పలరాజశర్మయును, దీక్షలను స్వీకరించి, దక్షిణలు ఇచ్చేదరా? లేదా? అని అడిగిరి.
బాపనార్యులు: మేమిద్దరమూ సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే కాని, వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారము కాదు. దీక్షలను చేపట్టుటలేదు కనుక మేము దక్షిణలు ఈయలేము. బ్రాహ్మణులలో ఎవరైనా దీక్షలను చేపట్టదలచి, దక్షిణలు ఇచ్చుటకు సంసిద్దులు అయిన యెడల వారి ఇష్టానుసారం చేయవచ్చును.
బ్రాహ్మణ పరిషత్తు అనునది సామూహిక సమస్యలు, ప్రయోజనము కలిగించు విషయములను గురించి ఆలోచించునే కాని, మీ యొక్క వ్యక్తిగత దీక్షలు, వ్యక్తిగత సమస్యలు గురించి ఆలోచింపరాదు అని తేల్చిచెప్పిరి. శ్రేష్టిగారును, వర్మగారును కూడా మండలదీక్షలను తీసుకొనుటకు నిరాకరించిరి.
క్షత్రీయులు, వైశ్యులకు దత్త మండలదీక్షలను తీసుకొనుటకు గాని, మానుటకు గాని వారికే స్వేచ్ఛ ఈయబడెను.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

.jpeg)
0 Comments