శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో పీఠికాపుర మార్గాంతరములో బైరాగి కలిసి, భగళాముఖీ దేవి గురించి వివరించి మరిన్ని విషయాలు తెలియజేస్తూఉన్నాడు.
బైరాగి: నేను తీర్థయాత్రలు చేయుచూ పీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానమును దర్శించితిని. అంతట ముద్దులు మూటగట్టు బాలకుని గాంచితిని. ఆ బాలకుడు నాతో, ఓయీ! నీవు బంగళాదేశము నుండి వచ్చినావని నాకు తెలుసును. నేను చాలా కాలము నుండియు ఈ మధ్యకాలం వరకూ ఇదే ఆలయములో స్వయంభూ దత్తుడనెడి పేర బందీనై ఉంటిని. నాకు తీవ్రముగా ఉక్క పోయుచున్నది. ఊపిరి ఆడుట లేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతలోపచారములు చేయవలెనని కోరితిని.
అందులకు వారు నిరాకరించిరి. గత్యంతరం లేక నేను బయిటకు వెళ్లిపోయెదను అని అంటిని. నీవు వెళ్ళుట కాదు, మేమే నిన్ను వెడలగొట్టెదమని అనిరి. అందువలన నేను బయిటకు వచ్చి స్వల్పకాలము అయినది అనెను.
నాకు వారి మాటల ఆంతర్యము బోధపడినది. వారు సాక్షాత్తు దత్తప్రభువులు అనియు, వారికి తగిన విధముగా శ్రర్ధాభక్తులతో అర్చనాదికములు జరుపబడుట లేదనియు, అస్పృశ్యత బొత్తిగా పాటించని కారణముననూ, కర్మిష్టులు అయిన బ్రాహ్మణులు, అస్పృశ్యులను లోనికి రానివ్వక పోవుటవలననూ, దీనదళితులను, ఆర్తిగొన్న వారిని రక్షించుటకు దత్తప్రభువుల వారే స్వయముగా అవతరించిరనియు నాకు అర్థమయ్యెను.
నేను వారిని, నా ఇష్ట దేవతా రూపమున దర్శనమిచ్చి నన్ను ధన్యుడను ఒనరింపుడని కోరితిని. ఆ మహాప్రభువు మందహాసం చేసిరి. నేను భగళాముఖీ మహాదేవిని దర్శించితిని. ఆ మహాతేజస్సును ఈ చర్మచక్షువులు చూడజాలవు. నేను మూర్ఛబోయితిని.
అచ్చట నున్న కొంతమంది దయ గలవారు నన్ను అక్కడనే ఉన్న ఒక చెట్టునీడన చాపవేసి పండుకొనబెట్టిరి.వాస్తవమునకు నాకు వచ్చినది మూర్ఛ కాదు. వారు బ్రహ్మానుభూతిని ఇచ్చిరి. ఆ దివ్యానందమును అనుభవించుచూ అష్ట దినముల పర్యంతము నేను అట్లే ఉంటిని. నాడీచలనము, హృదయస్పందనము లేదు.ఊరిలోని వారికి నా స్థితి ఏమో తెలియరాకుండెను.ఈ విషయము పీఠికాపురంలో గగ్గోలు పుట్టించినది.
మరిన్ని విషయాలు రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments