శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో దశమహావిద్యలలో మాతంగిదేవి గురించి బంగారయ్య ద్వారా తెలుసుకొని, బంగారయ్య ద్వారా చర్మ పాదుకలు గైకొని, వారి వద్ద సెలవు పుచ్చుకొని, శంకరభట్టు, ధర్మగుప్తులు తిరిగి పీఠికాపురము దిశగా తమ ప్రయాణము మొదలుపెట్టిరి.
ఒక అరణ్య ప్రాంతము గుండా పోవుచూ, ఒక మర్రిచెట్టు నీడన విశ్రాంతి తీసుకొనుచున్నారు. ఇంతలో కొందరు యోగిని గణములు అక్కడకు వచ్చినవి. వీరిని చూచి ఇది గండ్రకత్తెర కాలము. మీరు ఈ ప్రాంతమునకు రాదగినవారు కారు. ఇచ్చట మేము ఛిన్నమస్తాదేవిని అర్చించెదము. ఈమె చాలా గోపనీయమైనది. మగవారికి ప్రవేశము నిషిద్ధమైనది.అంతేకాక ఇది దేవభూమి. ఇచ్చటకు వచ్చిన వారెవ్వరూ ప్రాణములతో బయిటపడి పోరు అని చెప్పిరి.
శంకరభట్టు, ధర్మగుప్తుల ప్రాణములు పైపైనే పోయినవి. ఇంతలో మహాతేజోవిరాజితురాలైన యోగినీమాత ఒకామె వచ్చినది. ఆమె కన్నులు చింతనిప్పులు వలె ఉన్నవి. ఆమెతో వచ్చిన యోగినీగణములు ఒక బుట్టలో ఛిన్నమస్తాదేవిని పెట్టుకొని వచ్చిరి.
యోగినీమాత: వచ్చిన వారు ఎట్లయిననూ వచ్చిరి. వీరు ధరించుటకు కోకలను, రవికలను ఇవ్వండి అని యోగినీగణములతో అన్నది. వారు, శంకరభట్టుకు, ధర్మగుప్తులకు కోకలను, రవికలను ఇచ్చిరి. వీరు ధరించిన వస్త్రములను అచ్చట ప్రజ్వరిల్లుచున్న అగ్నిగుండము నందు వేసిరి. శంకరభట్టు, ధర్మగుప్తులు కోకలను, రవికలను ధరించిన తదుపరి వీరి శరీరములలో మార్పులు సంభవించినవి.
వీరికున్న పురుష చిహ్నములు మాయమవసాగేను. ఎత్తైన పాలిండ్లు ఏర్పడినవి. శరీరము నందు మర్మావయువములు కూడా మార్పు చెందినవి. స్త్రీ శరీరములు ఏర్పడినవి. వీరి స్వభావములు కూడా స్త్రీ స్వభావములుగా మారిపోయినవి. కంఠధ్వని కూడా స్త్రీ కంఠధ్వని వలె మారిపోయినది.
వీరికి యోగినీగణములచే కొత్త పేర్లు ఈయబడినవి. శంకరభట్టును - శంకరమ్మ అని, ధర్మగుప్తులను - ధర్మమ్మ అని పిలువసాగిరి.వీరికి భోజనము చేయుటకు మాంస పదార్థములు, త్రాగుటకు మద్యము ఈయబడెను.పగటిపూట మనుష్యునివలెనూ, రాత్రివేళ పెద్దపులి వలెనూ సంచరించెడి మర్లపులిని గురించి వినియుంటిమి.
కానీ, ఈ రకమైన దేవతా పూజలు ఉండునని గాని, యోగినీగణములు కేవలము సంకల్పమాత్రమున పురుషులను స్త్రీలుగా మార్చివేయగలుగుదురు అని కలలో కూడా ఊహించలేదు. రేపు ఈ పూజలో మర్మములు, రహస్యాలు గురించి తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏

.jpeg)
0 Comments